No. of Pages | 3 |
---|---|
Download Size | 381 KB |
Category | Telugu Books |
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan Story) - Preview
Read Online / Previewపొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan Story) - Summary
Ponniyin Selvan Story Telugu – పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్‘ అన్న చారిత్రిక నవలను ఆర్. కృష్ణమూర్తి అన్న ప్రసిద్ధ రచయిత వ్రాసారు. ఆయన కలంపేరు ‘కల్కి’. ఆయన పేరును కల్కి కృష్ణమూర్తి అని చెబితేగానీ జనులు గుర్తుపట్టలేనంతగా ప్రాచుర్యం చెందింది. కల్కి అన్న ఒక వారపత్రికను కూడా ఆయన స్థాపించారు. అది నేటికీ నడుస్తున్నది. ఆయన నవలలు ఆ వారపత్రికలోనే ధారావాహికంగా వచ్చేవి. ఆయన నవలలకు ఎంత డిమాండ్ ఉండేదంటే కేవలం ఆ సీరియల్ గురించి కల్కి వార పత్రిక 1950లలోనే 70వేల కాపీలకు పైగా అమ్ముడు పోయేవి. దేశంలోనే అప్పట్లో అది ఒక రికార్డు.
ఆయన వ్రాసిన చారిత్రిక నవలల్లో ముఖ్యమైనవి మూడు (కథా కాలానుక్రమంగా): ‘శివగామియిన్ సపదం‘ (శివగామి శపథం), ‘పార్తిపన్ కనవు‘ (పార్థిపుని కల), ‘పొన్నియిన్ సెల్వన్‘ (పొన్ని[కావేరి] యొక్క వరపుత్రుడు). తమిళ రాజవంశాల గురించి, వారి వీర గాథల గురించి వర్ణించిన నవలలవి. చరిత్రలో దొరికిన ఆధారాలు, జానపదుల పాటల్లోని కథలు, గాథలు, బోలెడన్ని కల్పనలు కలగలిసిపోయిన చారిత్రిక కల్పనా సాహిత్యమది. ముఖ్య పాత్రలన్నీ చారిత్రిక వ్యక్తులే అయినా చరిత్రలో కనిపించని ఎన్నో కథా పాత్రలు కూడా ఆ నవలల్లో కనిపిస్తాయి. స్వాతంత్ర పోరాట సమయంలోనూ, స్వతంత్రం వచ్చిన క్రొత్తలోనూ కల్కి రచనలు తమిళ ప్రజల్లో గొప్ప జాతీయ భావనను, పోరాట స్ఫూర్తిని నింపాయి. కల్కి కృష్ణమూర్తి స్వయంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు కూడా.
చాళుక్య రాజైన రెండవ పులకేశి పల్లవుల రాజధానియైన కాంచీపురంపై దండెత్తి పల్లవరాజు నరసింహ వర్మ యొక్క ప్రేయసి శివగామిని చెరబట్టి తీసుకు పోవడం, నరసింహ వర్మ తనను అవమానించిన చాళుక్యులను జయించి, వారి రాజధానియైన బాదామిని అగ్నికి ఆహుతి చేస్తే కాని తాను తిరిగి కంచికి వెళ్ళనని శివగామి శపథం చేయడం, అన్నట్లే నరసింహ వర్మ రెండవ పులకేశిని ఓడించి, బాదామి నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ప్రియురాలిని కంచికి తీసుకొని వెళ్ళడం మొదటి నవల యొక్క ముఖ్య కథ.
చోళరాజైన పార్థిపుడు పల్లవుల సామంత రాజుగా ఉండేవాడు. గొప్ప చరిత్ర గల చోళ రాజ వంశానికి మళ్ళీ మంచి రోజులు రావాలని, పల్లవుల సామంత రాజ్యంగా కాక చోళ రాజ్యం ఒక మహా సామ్రాజ్యంగా రూపొందాలనీ కలలు కనేవాడు. తన కుమారుడైన విక్రమునికి ఎప్పుడూ ఈ విషయమే చెబుతుండేవాడు. కొంత కాలానికి పార్థిపుడు పల్లవులకు కప్పం కట్టడానికి నిరాకరించడం, పల్లవ రాజైన నరసింహ వర్మ చోళ రాజ్యంపై దండెత్తడం, ఆ యుద్ధంలో పార్థిపుడు ఓడిపోయి చావుదగ్గర పడినప్పుడు ఒక సాధువు అతని దగ్గరకు వచ్చి అతను కన్న కలను అతని పుత్రుడు నిజం చేస్తాడని చెబితే విని అతను యుద్ధరంగంలో నిశ్చింతగా మరణించడం, అనేక మలుపుల తరువాత అతని పుత్రుడైన విక్రముడు నరసింహ వర్మ కుమార్తె కుందవిని వివాహం చేసుకొని, మామగారి సహాయంతో ఉరైయూరు రాజధానిగా స్వతంత్ర చోళ రాజ్యాన్ని నెలకొల్పి తన తండ్రి పార్థిపుడు కన్న కలను పాక్షికంగా నిజంచేయడం రెండవ నవల ఇతివృత్తం. పార్థిపునికి మరణ సమయంలో కనిపించిన సాధువు నరసింహ వర్మనే అన్నది కల్పనే అయినా నవలలో ఒక ముఖ్యమైన మలుపు.