No. of Pages | 68 |
---|---|
Download Size | 4 MB |
Category | Religious Books |
Krishna Story - Preview
Read Online / PreviewKrishna Story - Summary
శ్రీకృష్ణుడి జననం, జీవితం ఓ అద్భుతం
శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.
మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తునప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. “ఓ కంసా! నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం” అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగృడవుతాడు. “ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను” అని హూంకరిస్తాడు.
అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్ధిస్తాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లిని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు” అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.
మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు “ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని” ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా, ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం. అది ఇలా జరుగుతూనే వస్తుంది.
ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది.